నేడు ‘నమో భారత్‌’ రైలును ప్రారంభించనున్న ప్రధాని

PM Modi set to launch ‘Namo Bharat’ trains

న్యూఢిల్లీః భారత్​లో ఇప్పటికే వందే భారత్ ఎక్స్​ప్రెస్ పేరుతో సెమీ స్పీడ్ రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక ఇప్పుడు రీజనల్ ర్యాపిడ్ ఎక్స్ రైళ్లు రాబోతున్నాయి. ‘రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్’ పేరుతో ప్రాంతీయ రైళ్లను కేంద్ర సర్కార్ అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనికి నమో భారత్​గా పేరు పెట్టినట్లు సమాచారం. వందేభారత్ ఎక్స్​ప్రెస్ తర్వాత భారత్​లో పట్టాలెక్కుతున్న మరో హైస్పీడ్ రైలు ఇది. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి ప్రాంతీయ హైస్పీడ్ రైలును ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఢిల్లీ-గాజియాబాద్-మేరఠ్‌ కారిడార్‌లో తొలి రైలు నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సాహిబాబాద్, దుహై డిపోల మధ్య 17 కిలోమీటర్ల పొడవైన కారిడార్ అందుబాటులోకి వస్తోందని అన్నారు. నమో భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ల గరిష్ఠ వేగం గంటకు 180 కి.మీ. ఉంటుందని వెల్లడించారు. ఇందులో అధునాతన సదుపాయులున్నట్లు చెప్పారు. 8 ఆర్‌ఆర్‌టీఎస్‌ కారిడార్లలో నమో భారత్‌ రైళ్లు తిరగనున్నాయని వివరించారు. నమో భారత్ రైలులో ఆరు కోచ్‌లు, 2+2 తరహాలో సీట్లు ఉంటాయని.. ఈ రైలు ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు నడవనుందని పేర్కొన్నారు.