మైనర్ సమ్మతించిన..అది అత్యాచారమేః రేప్ కేసు విచారణలో ఢిల్లీ హైకోర్టు

Delhi High Court
Delhi High Court

న్యూఢిల్లీః మైనారిటీ తీరని అమ్మాయి లేదా అబ్బాయి ఆమోదంతోనే లైంగికంగా కలిసినప్పటికీ చట్ట ప్రకారం అది అత్యాచారం కిందికే వస్తుందని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. ఓ అత్యాచారం కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మైనర్ కు కీలక నిర్ణయాలు తీసుకునే మానసిక పరిణతి ఉండదని, అందుకే మైనర్ ఇష్టప్రకారం, పూర్తి సమ్మతితో జరిగినప్పటికీ దానిని అత్యాచారం కిందనే పరిగణిస్తామని జస్టిస్ జస్మీత్ సింగ్ పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన పదహారేళ్ల అమ్మాయి 2019లో ఇంట్లో నుంచి వెళ్లిపోయి 23 ఏళ్ల యువకుడితో కలిసి ఉంది. సుమారు ఒకటిన్నర నెలల పాటు అతడితోనే ఉంది. ఆ యువకుడికి అప్పటికే పెళ్లయింది. కూతురు కనిపించడంలేదని అమ్మాయి తండ్రి కేసు పెట్టడంతో పోలీసులు అమ్మాయితో పాటు యువకుడిని గాలించి పట్టుకున్నారు. అమ్మాయి మైనర్ కావడంతో యువకుడిపై కిడ్నాప్, అత్యాచారం ఆరోపణల కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైలులో ఉన్న యువకుడు తాజాగా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నాడు.

నిందితుడి బెయిల్ పిటిషన్ పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఇందులో భాగంగా.. అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఇద్దరూ కలిసి ఉంటున్నారని నిందితుడి తరఫు లాయర్ వాదనలు వినిపించారు. అయితే, మైనర్ తెలిపే అంగీకారం ఆమోదయోగ్యం కాదంటూ జడ్జి వ్యాఖ్యానించారు. పైగా, అమ్మాయి ఆధార్ కార్డులో పుట్టిన రోజు వివరాలను మార్చి, అమ్మాయి మైనర్ కాదని చూపేందుకు నిందితుడు ప్రయత్నించాడని జడ్జి పేర్కొన్నారు. ఆధార్ లో తప్పుడు మార్పులు చేయడం తీవ్రమైన నేరమని అన్నారు. దీంతో నిందితుడికి బెయిల్ ఇవ్వలేమంటూ పిటిషన్ ను జడ్డి కొట్టేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/