కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

Congress third list released

హైదరాబాద్‌ః ఇటీవల బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, సునీత మహేందర్ రెడ్డి‌లకు పార్టీ అధిష్ఠానం టిక్కెట్లు కేటాయించింది. లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 57 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ కీలక నేత అధిర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్ నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది.

పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి పేర్లను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో నలుగురిని ఖరారు చేసింది. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేశ్ షేట్కార్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డిల పేర్లను ప్రకటించింది. మెదక్, ఖమ్మం, భువనగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్… ఈ ఎనిమిది లోక్ సభ స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతోంది.