కుతూహలమ్మ మృతి పట్ల జగన్ , చంద్రబాబు దిగ్బ్రాంతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (74) మృతి పట్ల ఏపీ సీఎం జగన్ , మాజీ సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ఈమె..తిరుపతిలోని ఆమె నివాసంలో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గుమ్మడి కుతూహలమ్మ 1 జూన్ 1949లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ప్రకాశం జిల్లా , కందుకూరు లో జన్మించింది. ఆమె ఎం.బి.బి.ఎస్. పూర్తి చేసింది. అనంతరం ఆమె కొంతకాలం వైద్య వృత్తిలో పనిచేసింది. రాజకీయాలపై ఆసక్తితో 1979లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985లో తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు. వేపంజేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. 1991లో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. 1992-93లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు డిప్యూటీ స్పీకర్ గానూ వ్యవహరించారు. ఆమె 1985 నుంచి వరుసగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే, 2009లో వేపంజేరి నియోజకవర్గం రద్దు కాగా, ఎస్సీ రిజర్వుడు స్థానం గంగాధర నెల్లూరు నుంచి కుతూహలమ్మ పోటీ చేయాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు.

ఈమె మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. గుమ్మడి కుతూహలమ్మ అకాల మరణం బాధాకరమ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. జెడ్పీ ఛైర్ పర్సన్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ వంటి ఉన్నత పదవులు అధిరోహించి మహిళల అభ్యుదయాన్ని చాటి చెప్పారన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమ‌న్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధిలో ఆమె ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. కుతూహలమ్మ మృతికి టీడీపీ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు.

అలాగే సీఎం జగన్ కుతూహలమ్మ మృతిపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ మృతికి సంతాపం తెలియజేసిన సీఎం జగన్..కుతూహలమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.