ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్

Delhi CM Arvind Kejriwal arrested

న్యూఢిల్లీః ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. సెర్చ్ వారెంట్‌తో సాయంత్రం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ ఆ తర్వాత ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. రెండు గంటల పాటు ఆయనను విచారించిన అనంతరం అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. అరెస్ట్ విషయాన్ని కేజ్రీవాల్ భార్యకు చెప్పింది. కాసేపట్లో ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు. రేపు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు.

కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసినా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయరని తెలిపారు. ఎన్నికలకు ముందు ఆయన గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయనను అరెస్ట్ చేస్తే జైలు నుంచి ఢిల్లీని పరిపాలన చేస్తారని సాయంత్రమే చెప్పారు.

అంతకుముందు రామ్ నివాస్ గోయల్ మాట్లాడుతూ… ‘ముఖ్యమంత్రి నివాసం వద్ద మోహరించిన బలగాలను చూస్తే ఆయనను అరెస్ట్ చేయడానికి ఈడీ వచ్చినట్లుగా కనిపిస్తోంది. కేసు విచారణకు కోర్టు అంగీకరించినప్పటికీ ఈడీ ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది. మనీష్ సిసోడియాను గత ఏడాది అరెస్ట్ చేసిన ఈడీ ఇప్పటి వరకు ఆయనపై చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయింది. తమకు ఇది చిన్న ఎదురుదెబ్బ… అయినా పార్టీ మరింత బలపడుతుంది. అరెస్ట్ తర్వాత సీఎం కేజ్రీవాల్‌ రాజీనామా చేయవద్దని పార్టీ, ఎమ్మెల్యేలందరూ నిర్ణయించారు. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారు’ అన్నారు.