గుజరాత్ అసెంబ్లీలో గెలిచిన ఏకైక ముస్లిం ఎమ్మెల్యే

congress-imran-khedawala-lone-muslim-mla-in-new-gujarat-assembly

అహ్మాదాబాద్‌: గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బిజెపి ఘన విజయం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్య‌ర్థి.. ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయ‌న పేరు ఇమ్రాన్ ఖేడావాలా. గ‌త అసెంబ్లీలో ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలు ఉండేవారు. వాళ్లంతా కాంగ్రెస్ అభ్య‌ర్థులే. కానీ ఈసారి కేవ‌లం ఇమ్రాన్ ఒక్క‌రే విజ‌యం సాధించారు. అహ్మ‌దాబాద్ సిటీలోని జ‌మాల్‌పుర్‌-ఖేడియా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న గెలుపొందారు. ప్ర‌త్య‌ర్థిపై సుమారు 13 వేల ఓట్ల తేడాతో నెగ్గారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు మంది ముస్లిం అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి దించింది. దీంట్లో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గుజ‌రాత్ జ‌నాభాలో ముస్లింలు 10 శాతం ఉంటారు. ద‌రియాపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గ‌యాసుద్దిన్ షేక్‌, వానాకేర్ నుంచి జావెద్ పిర్జాదాలు ఓట‌మి చ‌విచూశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ముగ్గురు ముస్లిం అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి దించింది. జ‌మాల్‌పూర్‌-ఖేడియా, ద‌రియాపూర్‌, జాంబుసార్ నుంచి వాళ్లు పోటీప‌డ్డారు. కానీ ఒక్క‌రు కూడా గెల‌వ‌లేదు. ఒక్క ముస్లిం అభ్య‌ర్థికి కూడా బిజెపి టికెట్ ఇవ్వ‌లేదు. మ‌జ్లిస్ పార్టీ 12 మందికి టికెట్ ఇస్తే, ఒక్క‌రు కూడా గెల‌వ‌లేదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/