రాజద్రోహ చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే

ఈ చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయద్దన్న సుప్రీం

న్యూఢిల్లీ: రాజద్రోహ చట్టాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. సమీక్ష పూర్తయ్యే వరకు ఈ చట్టం కింద కొత్తగా ఎఫ్ఐఆర్ ల దాఖలును నిషేధించింది. వలస పాలన నాటి ఈ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు వాదనలు వింది. ‘‘ఈ చట్టాన్ని తిరిగి సమీక్షించడం పూర్తయ్యే వరకు దీన్ని వినియోగించకూడదు’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 124ఏ కింద (రాజ ద్రోహాన్ని ఈ సెక్షన్ కిందే విచారిస్తున్నారు) కేసులు నమోదై, జైళ్లలో ఉన్న వారు ఉపశమనం, బెయిల్ కోసం తగిన న్యాయస్థానాలను ఆశ్రయించొచ్చని సుప్రీంకోర్టు సూచించింది. ఈ చట్టాన్ని పునరాలోచించే దిశగా డ్రాఫ్ట్ ను కేంద్రం రూపొందించినట్టు అంతకుముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. రాజ ద్రోహం అభియోగాల కింద కేసు నమోదుకు తగిన ఆధారాలు ఉన్నాయని ఎస్పీ ర్యాంకు పోలీసు అధికారి భావించినప్పుడే చేయాల్సి ఉంటుందని వివరించారు. చట్టంపై సమీక్ష పూర్తయ్యే వరకు కొత్త కేసుల నమోదును నిలిపివేయడం సరికాదని వాదించారు.

కానీ, ఈ వాదనల పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం సంతృప్తి చెందలేదు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ పిటిషన్లర్లు పేర్కొంటున్న విషయాన్ని గుర్తు చేసింది. హనుమాన్ చాలీసా పారాయణం చేసినా రాజద్రోహం అభియోగాలతో కేసు పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తమవుతుందోని పేర్కొంటూ.. సమీక్ష పూర్తయ్యే వరకు నిషేధం అమలవుతుందని స్పష్టం చేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/