పౌరసత్వ చట్టం ఉద్దేశాలను వివరిస్తున్న బిజెపి
సీఏఏపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బిజెపి అగ్రనేతలు ఇంటింటి ప్రచారం
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం సీఏఏపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బిజెపి పెద్ద ఎత్తున ప్రచారం కార్యక్రమం చేపట్టింది. ప్రతి ఇంటికి సీఏఏపై అవగాహన కల్పించే క్రమంలో బిజెపి అగ్ర నేతలు ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పది రోజుల పాటు సాగే ఈ ప్రచారంతో దేశంలో కోట్ల కుటుంబాలను బిజెపి నేతలు కలుసుకునేలా ప్రణాళికలు రుపొందించారు. హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీలో పలు గృహాలను సందర్శించి పౌర చట్టం ఉద్దేశాలను వివరిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కర్ణాటకలో ముఖ్యమంత్రి యడియూరప్ప, భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకుర్లు ఆయా ప్రాంతాల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి లక్నోలో రిటైర్డు జిడ్జి జస్టిస్ కేమ్ కరన్కు ఆయన నివాసంలో కలిసి సీఏఏ ఉద్దేశాలను వివరించారు. విపక్షాలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని వారి మాటలు నమ్మరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ చట్టం భారత పౌరులపై ఎలాంటి ప్రభావం చూపబోదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/