భారతీయులందరికీ 2024 కల్లా వ్యాక్సిన్
రెండు వ్యాక్సిన్ డోసులకు దాదాపు రూ.1,000..ఎస్ఐఐ సీఈఓ పూనావాలా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణ వ్యాక్సిన్ కోసం ప్రపంచదేశాలు ఎదరుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పూణెకి చెందిన ఫార్మా దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈఓ అదార్ పూనావాలా తన అభిప్రాయాన్ని తెలిపారు. దేశంలో 2024కల్లా ప్రతి ఒక్కరికీ ఆ వ్యాక్సిన్ అందుతుందని పూనావాలా తెలిపారు. మొదట ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ దేశంలోని వైద్యారోగ్య సిబ్బందికి, వృద్ధులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా అందుతుందని చెప్పారు. అనంతరం ఏప్రిల్ నుంచి సాధారణ ప్రజలకు దాని పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. రెండు వ్యాక్సిన్ డోసులకు దాదాపు రూ.1,000 ఖర్చు అవుతుందని చెప్పారు. దేశంలోని అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు దాదాపు నాలుగు సంవత్సరాలు పడుతుందని తెలిపారు. వ్యాక్సిన్ సరఫరాతో పాటు పంపిణీల్లో ఉండే పరిమితులు, బడ్జెట్, మౌలిక సదుపాయాలు వంటి అంశాలే ఇందుకు కారణమని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని వ్యాక్సిన్ల ధరల కంటే తమ వ్యాక్సిన్ ధరే తక్కువని ఆయన తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/