ఏపీలో ఎన్నికలఫై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం నడుస్తుంది. ఈ క్రమంలో దేశ ప్రజలంతా ఎన్నికల ఫలితాల గురించే మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ఏపీ ఎన్నికల గురించి కాస్త ఎక్కువగా ఆరా తీస్తున్నారు. ఈసారి ఏపీలో ఏ పార్టీ విజయం సాదించబోతుందని..ఎవరు విజేత అవుతారని..ఏ పార్టీ కి ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు..? అంటూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ..ఏపీ ఎన్నికల ఫై స్పందించారు.

ఏపీలో జగన్‌ గెలవబోతున్నట్లు తమకు సమాచారముందని కేసీఆర్‌, కేటీఆర్‌లు అంటున్నారు. దీనిపై మీ సమాధానం..అని ప్రశ్నించగా..ఎక్కడైనా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంది. వాళ్లు చెప్పిన మాట నిలబెట్టుకోనందువల్ల ప్రతికూల వాతావరణం ఉంది. మేం షర్మిల నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాం. ఎన్ని సీట్లను గెలిపించుకోగలం? షర్మిల ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై ఎలా కొట్లాడుతున్నారు? ఆమెకు ఎలా మద్దతుగా నిలబడాలి? అనేదే మా ప్రణాళిక. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనేదే మా రాజకీయ ప్రణాళిక. ఈసారి అక్కడ అన్ని సీట్లలో పోటీకి దిగాం. మా దృష్టంతా కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలమైన ఎన్నికల వాతావరణాన్ని సృష్టించడంపైనే. మొదటి నుండి జగన్ విషయంలో కేసీఆర్ కు సానుకూలంగా ఉంటూ వస్తున్నారు. ప్రతి విషయంలో జగన్ కు సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. అందుకే ఆయన సీఎం జగన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపినట్లు ఉందంటూ రేవంత్ చెప్పుకొచ్చారు.