చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటి
లోకేశ్ తో కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిశోర్
అమరావతిః ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టిడిపి అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం నారా లోకేశ్ తో కలిసి ప్రశాంత్ కిశోర్ విజయవాడ చేరుకున్నారు. వారిరువురు ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ప్రశాంత్ కిశోర్ ను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. కాగా, చంద్రబాబు-ప్రశాంత్ కిశోర్ భేటీలో రాబిన్ శర్మ టీమ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ‘షో టైమ్ కన్సల్టెన్సీ’ పేరిట రాబిన్ శర్మ టిడిపి రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. లోకేశ్, ప్రశాంత్ కిశోర్ కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడ రావడంతోనే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.