ప్రధాని మోడికి సిఎం కేజ్రీవాల్‌ లేఖ

కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో అన్ని మాల్స్, రెస్టారెంట్లు, మెట్రో సర్వీసులు తెరిపించండి

Arvind Kejriwal
Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కరోనా లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ప్రధాని మోడికి లేఖ రాశారు. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో అన్ని మాల్స్, రెస్టారెంట్లు, మెట్రో సర్వీసులు వంటివాటిని తెరవాలని కేజ్రీవాల్ లేఖ రాశారు. లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తే కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని… అయితే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన ఆసుప్రతులు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, అంబులెన్సులు, ఐసీయూలను సిద్ధంగా ఉంచామని చెప్పారు.

అన్ని మార్కెట్లు, మార్కెట్ కాంప్లెక్సులను ఓపెన్ చేయాలని.. అయితే సరి, బేసి విధానాన్ని పాటించాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దీని వల్ల అత్యవసరం కాని షాపులు కూడా ప్రతి రోజు 50 శాతం తెరుచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. మాల్స్ లో 33 శాతం షాపులను తెరవాలని కోరారు. 50 శాతం ఉద్యోగుల హాజరుతో అన్ని ప్రైవేట్ కార్యాలయాలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మిగిలిన 50 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారని తెలిపారు. 65 ఏళ్లు దాటినవారు, గర్భిణులు, 10 సంవత్సరాల లోపు పిల్లలు ఇంట్లోనే ఉండాలని చెప్పారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/