ఉపాధి హామీ బ‌కాయిలను మంజూరు చేయాలనీ ఆర్ధిక మంత్రిని కోరిన సీఎం జగన్

ఢిల్లీ లో సీఎం జగన్ ..కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ భేటీ ముగిసింది. ఢిల్లీ టూర్ లో బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను జగన్ కలిశారు. సుమారు 40 నిముషాల పాటు అమిత్ షా తో జగన్ సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ తో భేటీ అయ్యారు. తొలుత నిర్మల అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో ఉదయాన్నే ఏపీ బయల్దేరాలని జగన్ భావించారు. కానీ చివరి నిమిషంలో నిర్మల అపాయింట్‌మెంట్ అందడం తో భేటీ అయ్యారు.

ఈ భేటీ లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని, వెంటనే ఈ డబ్బు మంజూరుచేయాలని సీఎం జగన్.. మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చించారు. ప‌లు అంశాల‌పై కేంద్ర మంత్రికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివేదించారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తప్పులేకున్నా… రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదని , నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని, 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లుకు కుదించిన విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లారు.

తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉందని, ఈ డబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా కోరారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయని, వాటిని విడుదల చేసేలా చూడాలని కోరడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్ గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని కోరారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని విజయవాడ బయల్దేరారు.