రుహుల్లాకు వైస్సార్సీపీ ఎమ్మెల్సీ టికెట్
కరీమున్నీసా తనయుడు రుహుల్లాకు బీఫామ్ అందజేత
అమరావతి : ఏపీలో అధికార పార్టీ వైస్సార్సీపీ లో అనతి కాలంలోనే ఎమ్మెల్సీ వంటి కీలక పదవిని దక్కించుకుని దానిలో పూర్తి స్థాయిలో కొనసాగకుండానే కన్నుమూసిన దివంగత వైస్సార్సీపీ మహిళా నేత కరీమున్నీసా కుటుంబానికి ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. కరీమున్నీసా మరణంతో ఆమె స్థానానికి జరగనున్న ఎన్నికలో వైస్సార్సీపీ టికెట్ను కరీమున్నీసా తనయుడు రుహుల్లాకు కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం రుహుల్లాకు జగన్ బీఫామ్ అందజేశారు.
విజయవాడ నగరానికి చెందిన మైనారిటీ మహిళ కరీమున్నీసాకు ఏ ఒక్కరి అంచనాలకు అందకుండా ఏకంగా ఎమ్మెల్సీ అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన నెలల వ్యవధిలోనే ఆమె అనారోగ్యం కారణంగా మృత్యువాత పడ్డారు. ఫలితంగా శోకసంద్రంలో కూరుకుపోయిన ఆమె కుటుంబానికి జగన్ భరోసా ఇచ్చారు. కరీమున్నీసా స్థానానికి జరిగే ఎన్నికలో ఆమె కుమారుడు ఎండీ రుహుల్లాకు అవకాశం కల్పిస్తానని జగన్ ఇదివరకే హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు బుధవారం నాడు రుహుల్లాకు పార్టీ బీఫామ్ ను జగన్ అందజేశారు. ఈ ఎన్నికలో రుహుల్లా ఈజీగానే విజయం సాధించే అవకాశాలున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/