టిడిపిలో చేరిన చిత్తూరు కాంగ్రెస్ నేత సురేశ్ బాబు

కుప్పంలో లక్ష మెజార్టీ సాధించాలని శ్రేణులకు దిశానిర్దేశం

Chittoor Congress leader Suresh Babu joined TDP

అమరావతిః తమకు సంపద సృష్టించడమేగాక.. సంక్షేమ పథకాలను అమలు చేయడమూ తెలుసని టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమ పథకాలకు నాంది పలికింది మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ అని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కుప్పంలో లక్ష మెజార్టీ సాధించాలని శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

చిత్తూరు డీసీసీ మాజీ అధ్యక్షుడు సురేశ్ బాబు.. గురువారం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. సురేశ్ బాబు, ఆయన అనుచరులకు పార్టీ కండువా కప్పి చంద్రబాబు సాదరంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి, కాంగ్రెస్ నుంచి వందలాది మంది కార్యకర్తలు టిడిపిలో చేరారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘టీటీటీని ఏర్పాటు చేసినప్పటి నుంచి కుప్పంలో పార్టీ జెండానే ఎగురుతోంది. లక్ష మెజారిటీని తీసుకొచ్చే లక్ష్యంతో పని చేస్తామని చెబుతున్న మిమ్మల్ని అభినందిస్తున్నా. పిల్లల భవిష్యత్ బంగారుమయం కావాలంటే, కుప్పం నియోజకవర్గానికి పూర్వ వైభవం రావాలంటే.. టీడీపీని గెలిపించాలి’’ అని పిలుపునిచ్చారు.