తెలుగు ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన సినీ , రాజకీయ ప్రముఖులు

క్రిస్మస్‌ సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడ్రోజుల ముందు నుంచే క్రిస్మస్ సందడి షురూ అయింది. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా కొందరు ప్రముఖులు తమ సన్నిహితులు, స్నేహితులకు క్రిస్మస్ కానుకలను పంపిస్తున్నారు. క్రిస్టియన్లు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

ఈ సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ,సినీ ప్రముఖులు, పలు రాజకీయ పార్టీల అధినేతలు ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పారు. ఏసుప్రభువు బోధనలు, శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం ఎప్పటికీ అనుసరణీయమని రేవంత్ రెడ్డి అన్నారు. క్రిస్టియన్ సోదరులు సంతోషంతో, ఆనందోత్సాహాలతో క్రిస్మస్ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమా, సహనం, దాతృత్వం, త్యాగం…మానవాళికి ఏసుక్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సైతం తెలుగు ప్రజలకు క్రిస్మస్‌ విషెస్‌ చెప్పారు. సమాజంలోని బాధితుల పక్షాన ప్రేమను పంచడం, అందరినీ సమదృష్టితో చూడటం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత స్థాపపన కృషి చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రేమ, కరుణ, క్షమాగుణాలను…తన జీవిత సందేశంగా మానవాళికి అందించిన ఏసుక్రీస్తు జన్మించిన పర్వదినమే క్రిస్మస్ అన్నారు. దయామయుడు లోకానికి వచ్చిన పర్వదినమైన క్రిస్మస్ పండుగను అనందోత్సాహాలతో జరుపుకోవాలని లోకేశ్‌ అన్నారు.

క్రైస్తవ మత ఆరాధకులందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌. సామాజిక విలువలు చైతన్యం కావాలంటే క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం ఎల్లప్పుడూ ఆచరణీయమన్నారు. దేశ ప్రజలందరూ శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుకున్నారు. అటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సతీమణి అనా కొణిదెల అనాథాశ్రమంలో క్రిస్మస్‌ వేడుకలు చేసుకున్నారు. హైదరాబాద్‌ బాలాజీ స్వర్ణపురి కాలనీలోని జీవోదయ హోమ్‌ చిన్నారులతో కలిసి సందడి చేశారు. చిన్నారులతో కలిసి క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేశారు. అనాథాశ్రమానికి నిత్యావసర సరకులను అందజేశారు.