పెద్ద నోట్ల రద్దును సమర్థించిన సుప్రీంకోర్టు

supreme court
supreme court

న్యూఢిల్లీ: నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జస్టిస్ ఎస్ ఏ నజీర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. డీమానిటైజేషన్పై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. ఆర్బీఐ సలహాతోనే కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన 58 పిటిషన్లను ధర్మాసనం కొట్టి వేసింది.

కాగా, పెద్ద నోట్ల రద్దు చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ చట్టబద్ధమైనదేనని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసే ముందు తగిన చర్యలు తీసుకున్నారని చెప్పింది. అలాగే రద్దు చేసిన నోట్ల బదిలీ కోసం ఇచ్చిన గడువు హేతుబద్ధం కాదని చెప్పలేమని పేర్కొంది. ఈ కేసును జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌, జస్టిస్‌ బీఆర్‌ గవై, జస్టిస్‌ ఏఎస్‌ బొపన్న, జస్టిస్‌ వి రామసుబ్రమణ్యం, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన బెంచ్‌ విచారించింది. కేంద్ర ప్రభుత్వం 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సుప్రీం ఈ మేరకు తీర్పు వెలువరించింది.