చిరంజీవి చేతుల మీదుగా నితిన్ కొత్త చిత్రం ప్రారంభం

నితిన్ కొత్త చిత్ర శుక్రవారం ప్రారంభమైంది. చలో , భీష్మ చిత్రాల డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్ నటిస్తున్నాడు. ఈ చిత్ర ప్రారంభ వేడుకకు ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరై , క్లాప్ కొట్టారు. గతంలో వెంకీ కుడుముల – నితిన్ – రష్మిక కలయికలో ‘భీష్మ’ సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోసారి వీరి కాంబో రిపీట్ కాబోతోంది. ఈసారి ఈ కాంబోను అందిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.

ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు ఒక ప్రకటన చేశారు. ఒక వీడియోతో అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ వీడియో చూస్తుంటేనే సినిమా ఎంత వినోదభరితంగా ఉండబోతోందో అర్థమైంది. కాకపోతే, ‘భీష్మ’లా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నట్టు దర్శకుడు వెంకీ కుడుముల క్లారిటీ ఇచ్చారు. ఈ క్రేజ్ ప్రాజెక్ట్‌ను ఈరోజు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులో జరిగిన చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

నితిన్, రష్మిక మందనపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ఇవ్వగా.. ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ‘వీరసింహారెడ్డి’ దర్శకుడు గోపీచంద్ మలినేని ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. ఇక దర్శకులు హను రాఘవపూడి, బుచ్చిబాబు సానా స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందజేశారు.