శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ పదవికి బండ ప్రకాశ్‌ నామినేషన్‌ దాఖలు

mlc-banda-prakash-files-nomination-for-council-deputy-chairman-post

హైదరాబాద్: ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. బండ ప్రకాశ్‌ వెంట మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసుధానాచారి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదితరులు ఉన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్‌ పేరును బిఆర్ఎస్ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే.

మండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ పదవీకాలం 2021, జూన్‌ 3న పూర్తయింది. దీంతో అప్పటినుంచి డిప్యూటీ చైర్మన్‌ పదవి ఖాళీగా ఉన్నది. ఈనేపథ్యంలో డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్‌ వెలువడింది. ఆదివారం ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన తర్వాత డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియను పూర్తిచేసయనున్నారు. అనంతరం బాధ్యతలు అప్పగిస్తారు.