తల్లికి, చెల్లికి కూడా న్యాయం చేయని వ్యక్తి జగన్ః చింతమనేని
జగన్ ఏపీని నాశనం చేశారంటూ చింతమనేని విమర్శలు
అమరావతిః ఏపీలోని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఏపీని నాశనం చేశారని దుయ్యబట్టారు. గన్నవరం నియోజకవర్గం నుంచి టిడిపి తరపున పోటీ చేయడానికి 10 మంది వరకు పోటీ పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో వైఎస్ఆర్సిపి సైకోలు తయారయ్యారని విమర్శించారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో గన్నవరంలో భూముల విలువ ఎంత ఉందో… ఇప్పుడు విలువ ఎంతో గమనించాలని చింతమనేని అన్నారు. గన్నవరం విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్న విమానాల సంఖ్య కూడా తగ్గిపోయిందని చెప్పారు. సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకుని రాజకీయ వ్యభిచారం చేసిన చరిత్ర జగన్ దని అన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని… బాబును గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.