కరోనా వైరస్‌ పై చైనా కొత్త వాదన

కరోనా వుహాన్‌లో పుట్టలేదు..ప్రపంచంలోని చాలా చోట్ల వెలుగుచూసింది.. చైనా తాజా ప్రకటన

China

బీజింగ్‌: కరోనా మహమ్మారి చైనాలోని వుహాన్‌ నగరంలో పుట్టి ప్రపంచమంతా వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రత్యేక బృందం విచారణకు సిద్ధమవుతున్న సమయంలో చైనా తాజాగా కొత్త వాదన వినిపిస్తుంది. కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో బయటపడిందన్న వాదనను కొట్టిపడేసింది. దాని మూలాలు ప్రపంచంలోని చాలా చోట్ల ఉన్నాయని పేర్కొంది. దీని మూలాలు చైనాలోనే వున్నాయన్న వార్తల్లో నిజం లేదని, నిజానికి వైరస్ ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వెలుగు చూసిందని, కాకపోతే ఆ విషయాన్ని తొలుత వెల్లడించింది మాత్రం తామేనని పేర్కొంది. వైరస్ వ్యాప్తి గురించి తొలుత నివేదించి, దాని జన్యుక్రమాన్ని గుర్తించి ప్రపంచానికి వెల్లడించామని వివరించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్ తెలిపారు.

జపాన్‌లోని టోక్యో వేదికగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్ కూటమి వైరస్ విషయంలో చైనా తీరును తీవ్రంగా తప్పుబట్టింది. వైరస్ విషయంలో చైనా వాస్తవాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేసిందని అమెరికా ఆరోపించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా అప్పట్లో చైనా వాదనకు వంతపాడిందని విమర్శించింది. దీంతో స్పందించిన చైనా ఈ సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/