కరోనాను లెక్క చేయని ట్రంప్
తుపానుపై చర్చించేందుకే వచ్చారన్న వైట్ హౌస్
వాషింగ్టన్: కరోనా వైరస్ కు ప్రపంచమంతా భయపడుతుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం లెక్కచేయనట్టుగానే వ్యవహరించారు. స్వయంగా తాను కరోనా బారిన పడినప్పటికీ తన ధోరణిని మార్చుకోలేదు. రెండు రోజుల వ్యవధిలోనే ఆసుపత్రి నుంచి వైట్ హౌస్ కు చేరుకున్నారు. తన నివాసానికి వెళ్తున్న సమయంలో మాస్క్ కూడా ధరించకపోవడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు కరోనా నుంచి ఆయన పూర్తిగా కోలుకోకపోవడంతో… వైట్ హౌస్ లో ఐసొలేషన్ లో ఉంటూనే పాలనా వ్యవహారాలను చూసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. అయితే ఆయన మరోసారి నిబంధనలను అతిక్రమించారు. వైద్యుల మాటలను పట్టించుకోకుండా… వోవల్ కార్యాలయానికి చేరుకుని విధులు నిర్వర్తించారు. దీనిపై మరోసారి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఏర్పడబోయే తుపానుపై చర్చించేందుకే ఆయన వోవల్ కార్యాలయానికి వచ్చారని తెలిపింది.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/