డిసెంబర్ 1న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు
ఈ నెల 30న కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల పయనం
అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు ఇటీవల కంటికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలో పుణ్యక్షేత్రాలను సందర్శించాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 30న తిరుమల వెళ్లనున్నారు. డిసెంబరు 1న శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అదే రోజు రేణిగుంట నుంచి బయల్దేరి అమరావతి చేరుకుంటారు. చంద్రబాబు డిసెంబరు 2న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం, సింహాచలం క్షేత్రం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆపై చంద్రబాబు పూర్తిస్థాయిలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొననున్నారు.
కాగా, కంటి శస్త్రచికిత్స చేయించుకున్న చంద్రబాబు కొంతకాలంగా హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో… డిసెంబరు మొదటి వారం నుంచి ఆయన పూర్తిస్థాయి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.