కాంగ్రెస్ మొసలి కన్నీరు నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయిః ఎమ్మెల్సీ కవిత

brs-mlc-kavitha-press-meet-in-nizamabad

నిజామాబాద్ : రాష్ట్రంలో నిరుద్యోగులను కాంగ్రెస్ రెచ్చగొడుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్, బిజెపి కలిసి ఐదేళ్లలో ఉద్యోగాలకు కేవలం 21 నోటిఫికేషన్ లే ఇచ్చాయని అన్నారు. అదే తెలంగాణలో గడిచిన పదేళ్లలో 2.30లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయని చెప్పారు.

ఇప్పటికే 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ప్రైవేటులో 30లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా 10 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించామని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, ఇళ్లకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ కాంగ్రెస్ నేతల సమావేశాలు మాత్రమే జరిగాయని… కాంగ్రెస్ మొసలి కన్నీరు నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని కవిత అన్నారు.