వైఎస్ఆర్సిపి పతనం ప్రారంభమైంది..చంద్రబాబు
అమరావతి: ఏపిలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టిడిపి అధినేత ఈరోజు మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పతనం ప్రారంభమైందని అన్నారు. వైఎస్ఆర్సిపి పతనానికి ఇది ఆరంభం మాత్రమేనని… ఆ పార్టీని ఎవరూ కాపాడలేరని చెప్పారు. దుర్మార్గమైన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదని అన్నారు.
పంచాయతీ ఎన్నికలు సక్రమంగా, ప్రశాంతంగా జరిగి ఉంటే టిడిపికి మరో 10 శాతం ఫలితాలు పెరిగేవని చంద్రబాబు చెప్పారు. అదే జరిగి ఉంటే వైఎస్ఆర్సిపి ఇప్పుడే పతనమై ఉండేదని అన్నారు. అధికార దుర్వినియోగంపై ఆధారపడి వైఎస్ఆర్సిపి ఎక్కువ శాతం స్థానాలను గెలుచుకుందని చెప్పారు. పోలీసులు ఉంటేనే వైఎస్ఆర్సిపి నేతలు ప్రతాపం చూపుతారని ఎద్దేవా చేశారు. తప్పుడు కేసులు పెట్టి ఓట్లు వేయించుకోవడం ప్రజాస్వామ్యమా? అని దుయ్యబట్టారు.
పంచాయతీ ఎన్నికల్లో టిడిపి నేతలు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని చంద్రబాబు ప్రశంసించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పోరాటం చేశారని అన్నారు. అన్ని చోట్లా ఏకగ్రీవాలు చేసుకోవాలనుకున్న వైఎస్ఆర్సిపి కుట్రలు సాగలేదని చెప్పారు. కొత్తవలసలో టిడిపి మద్దతిచ్చిన అభ్యర్థికి 250 ఓట్ల మెజార్టీ వచ్చినా రీకౌంటింగ్ కోరతారా? అని మండిపడ్డారు. టిడిపి గెలిస్తే రీకౌంటింగ్ చేస్తారని… వైఎస్ఆర్సిపి గెలిచిన చోట రీకౌంటింగ్ చేయరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/