సైబర్ నేరాల్లో తెలంగాణ నంబర్ వన్ గా తేల్చిన ఎన్‌సీఆర్బీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుండి అభివృద్ధి లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా అతి తక్కువ సమయంలో తెలంగాణ అభివృద్ధి చెందింది. వ్యవసాయం , ఐటి, పరిశ్రమలు ఇలా అది ఇది కాదు అన్నింట్లోనూ దూసుకుపోతుంది. కేవలం అభివృద్ధి మాత్రమే కాదు సైబర్ నేరాల్లో కూడా తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్బీ) తెలిపింది.

ఎన్‌సీఆర్బీ తెలిపిన ప్రకారం.. తెలంగాణలో 2019లో 1,18,338 కేసులు నమోదు కాగా.. కరోనా, లాక్‌డౌన్ ప్రభావం ఎక్కువా ఉన్న 2020లో 1,35,885 కేసులు నమోదయ్యాయి. 2021లో ఏకంగా 1,46,131 కేసులు నమోదయ్యాయి. ఇక రెండేళ్లలోనే సైబర్ నేరాలు నాలుగు రెట్లు పెరిగినట్లు తెలిపింది. 2019లో రాష్ట్రంలో 2691 సైబర్ కేసులు నమోదు కాగా.. 2021లో ఈ సంఖ్య 10,303కి చేరింది. దేశంలో నమోదైన సైబర్ నేరాల కేసుల్లో దాదాపు ఐదో వంతు తెలంగాణలో నమోదవడం గమనార్హం.

ఏటీఎం, ఓటీపీ మోసాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఫ్రాడ్, నకిలీ ఫ్రొఫైళ్లు తదితర నేరాలు సైతం తెలంగాణలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. 2021లో రాష్ట్రంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు 20,579 నమోదయ్యాయి. 23,757 కేసులతో రాజస్థాన్ తొలి స్థానంలో ఉంది. ఫోర్జరీ కేసులు, చీటింగ్ కేసుల్లోనూ రాజస్థాన్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఇక ఆహారం, ఔషధాల కల్తీ కేసుల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. దేశం మొత్తం మీద ఈ తరహా 8320 కేసులు నమోదు కాగా.. ఏపీలో 6575 కేసులు, తెలంగాణలో 1326 కేసులు నమోదయ్యాయి. మహిళలపై నేరాలు సైతం తెలంగాణలో పెరుగుతున్నాయి.

ఇక రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే.. 2020తో పోలిస్తే.. రాష్ట్రంలో యాక్సిడెంట్లు 10.8 శాతం పెరిగాయి. వృద్ధులపై దాడుల విషయంలో తెలంగాణ 1952 కేసులతో మూడో స్థానంలో నిలిచింది. ఈ విషయంలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇలా మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం నేరాల్లో టాప్ వన్ గా నిలిచింది.