సర్కారు మారితేనే బతుకులు మారుతాయిః షర్మిల

దొరల పాలన మళ్లీ వచ్చిన సమయంలో పుట్టిందే వైఎస్‌ఆర్‌టిపి అన్న షర్మిల

sharmila-fires-on-kcr

హైదరాబాద్‌ః 3 కోట్ల మంది పోరాటం, అమరవీరుల త్యాగ ఫలితం “మన తెలంగాణ” అని వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సాంస్కృతిక వారసత్వం, విభిన్న సంస్కృతి తెలంగాణ సొంతమని ఆమె కొనియాడారు. జయశంకర్ సార్ ఆశయాల సాధన కోసం, ఉద్యమ ఆకాంక్షల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం వైఎస్‌ఆర్‌టిపి కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పార్టీ కార్యాలయం వద్ద ఈరోజు షర్మిల జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా షర్మిల ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… “నీళ్లు, నిధులు, నియామకాల కోసం మూడు కోట్ల మంది ఏకమై, కొట్లాడితే వచ్చింది “తెలంగాణ”. అమరవీరుల త్యాగ ఫలితం, సబ్బండ వర్గాల పోరాట ఫలితం “తెలంగాణ”. ప్రత్యేక రాష్ట్రంలోనూ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు కనుమరుగవుతున్న వేళ, దొరల పాలన మళ్లీ వచ్చిన వేళ, ప్రతిపక్షాలు అమ్ముడుపోయిన సమయంలో పుట్టిందే వైఎస్‌ఆర్‌టిపి. నియామకాల కోసం మొట్టమొదటగా పోరాటం చేసి.. గెలిచి, నిలిచింది వైఎస్సార్టీపీ.

అన్నం మెతుకులు ముట్టకుండా నిరుద్యోగ దీక్షలతో సర్కారు మెడలు వంచి నోటిఫికేషన్లు ఇప్పించింది. కాంట్రాక్టు కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాల నిలబడింది. నిధులు పక్కదారి పడుతుంటే, తెలంగాణ సంపద కెసిఆర్ కుటుంబం చేతిలో బందీ అయితే ప్రశ్నించే గొంతుకగా నిలిచింది. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పులకుప్ప చేస్తే ఎదురు నిలిచి, ప్రశ్నించింది. అక్రమ అరెస్టులతో, పోలీసు లాఠీలతో, అక్రమ నిర్బంధాలతో హింసించినా.. మొక్కవోని దీక్షతో పోరాటం చేసింది. నీటి వాటాల్లో అన్యాయం జరిగితే, కాళేశ్వరంతో వేల కోట్లు దోచుకుంటే.. నిస్వార్థంగా ఉద్యమించింది. 3800 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి, కెసిఆర్ ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలను ఎండగట్టింది. రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇళ్లు, పోడు పట్టాలు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, మూడెకరాల భూమి, వడ్డీ లేని రుణాలు, కేజీ టు పీజీ ఉచిత విద్యపై గొంతెత్తింది.

ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్లీ మరో ఉద్యమం జరగాలి. సర్కారు మారితేనే బతుకులు మారుతాయి. మళ్లీ వ్యవసాయం పండుగ కావాలన్నా, సొంతింటి కల నెరవేరాలన్నా.. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు కావాలన్నా రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన రావాలి. జలయజ్ఞం ద్వారా జలసిరులు కురవాలి. అర్హులకు పోడు పట్టాలు అందాలి. పేదలకు భూములు దక్కాలి. దళిత, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగాలి. ప్రజలు అభివృద్ధి బాట పట్టాలి. సబ్బండ వర్గాలకు సంక్షేమం చేరాలి. ఇందుకోసం వైఎస్‌ఆర్ బిడ్డ కట్టుబడి ఉంది” అని అన్నారు.