రాజమండ్రి జైలు నుంచి విడుదలైన చంద్రబాబు

జైలు వద్దకు భారీగా చేరుకున్న టిడిపి కార్యకర్తలు, అభిమానులు

chandrababu-released-from-rajahmundry-jail

అమరావతిః రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విడుదలయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 53 రోజులుగా ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఈరోజు చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల అనంతరం తిరిగి నవంబరు 28న సాయంత్రం 5 గంటల్లోపు సరెండర్ అవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, జైలులో లాంఛనాలన్నీ ముగించుకున్న చంద్రబాబు ప్రధాన ద్వారం నుంచి వెలుపలికి వచ్చారు. చంద్రబాబు కోసం జైలు బ్యారికేడ్లను కూడా తోసుకుని వేలాదిమంది టిడిపి కార్యకర్తలు, అభిమానులు రావడంతో అక్కడంతా కోలాహలం నెలకొంది. జై చంద్రబాబు నినాదాలతో జైలు పరిసరాలు మార్మోగిపోయాయి. కాగా, విడుదల నేపథ్యంలో చంద్రబాబు కాన్వాయ్, ఎన్ ఎస్ జీ బృందం జైలుకు వద్దకు చేరుకుంది. చంద్రబాబు అమరావతి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.