పోలీసులకు కూడా రక్షణ లేని అరాచక పాలన కొనసాగుతుందిః చంద్రబాబు

అనంతపురం గుల్జార్ పేట సెబ్ పోలీస్ స్టేషన్ పై దాడి

chandrababu

అమరావతిః అనంతపురంలోని గుల్జార్ పేట సెబ్ పోలీస్ స్టేషన్ పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన మీడియాలో ప్రసారం కాగా దీనిపై చంద్రబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో పోలీసులకు కూడా రక్షణ లేని అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. అక్రమ మద్యం కేసులో పట్టుబడిన వ్యక్తిని విడిచిపెట్టాలంటూ సెబ్ పోలీస్ స్టేషన్ పై దాడి చేయడాన్ని, పోలీసులను చితకబాదడాన్ని, మహిళా పోలీస్ డ్రెస్ లాగుతూ పీఎస్ నుంచి బయటకు ఈడ్చుకెళ్లడాన్ని పాలకులు, పాలకులకు కొమ్ముకాస్తున్న పోలీసు పెద్దలు ఎలా సమర్థించుకుంటారని చంద్రబాబు నిలదీశారు.

ముఖ్యంగా, ఈ దాడిలో వైఎస్‌ఆర్‌సిపి రౌడీలతో పాటు వాలంటీర్లు కూడా పాల్గొనడం ఇంకా దారుణం అని పేర్కొన్నారు. ఒక నేరగాడికి అధికారం ఇచ్చినందుకు ప్రజలు ఇలాంటి నేరస్తుల పహారాలో భయం భయంగా బతకాల్సి వస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.