ఇప్ప‌టిదాకా పొత్తుల గురించి మాట్లాడ‌లేదుః చంద్ర‌బాబు

రాష్ట్రం కోసం అవ‌స‌రాన్ని బ‌ట్టి స‌మ‌యానుకూలంగా పొత్తుల‌పై నిర్ణయం..చంద్ర‌బాబు

chandrababu-comments-in-party-meeting

అమరావతిః పొత్తుల‌పై టిడిపి అధినేత నారా చంద్ర‌బాబునాయుడు స్ప‌ష్ట‌త నిచ్చారు. ఇత‌ర పార్టీల‌తో టిడిపి పొత్తుల గురించి తాను ఇప్ప‌టిదాకా మాట్లాడ‌లేద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. రాష్ట్రం కోసం అవ‌స‌రాన్ని బ‌ట్టి స‌మ‌యానుకూలంగా పొత్తుల‌పై నిర్ణయం ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో మాట్లాడిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేశారు. పొత్తుల గురించి తాను ఇప్ప‌టివ‌ర‌కు మాట్లాడ‌లేద‌న్న చంద్ర‌బాబు… ఈ విష‌యంపై పార్టీ నేత‌ల‌కు స్ప‌ష్ట‌త ఉండాల‌ని తెలిపారు.

పార్టీ శ్రేణులు నిరంతరం ప్ర‌జ‌ల్లోనే ఉంటూ ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. త‌ద్వారా ప్ర‌జ‌ల్లో పార్టీ ప‌ట్ల న‌మ్మ‌కాన్ని పాదుకొల్పాల‌ని ఆయ‌న సూచించారు. ఎన్నిక‌లు త్వ‌ర‌గా వ‌స్తే రాష్ట్రానికి ప‌ట్టిన పీడ వ‌దిలిపోతుంద‌ని ఆయ‌న వైఎస్‌ఆర్‌సిపిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. నెత్తిన ఉన్న కుంప‌టిని ఎప్పుడెప్పుడు దింపుకుందామా? అని ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌ని చంద్ర‌బాబు అన్నారు. పార్టీ కోసం పోరాడే నేత‌లు మ‌రింత మంది త‌యారు కావాల్సి ఉంద‌ని, పార్టీలోని సీనియ‌ర్లు అలాంటి నేత‌ల‌ను త‌యారు చేసే బాధ్య‌త‌ల‌ను తీసుకోవాల‌ని ఆయన సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/