మూడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు

ఇటీవల పంజాబ్, యూపీ, ఒడిశాలో ఉప ఎన్నికలు

by-polls-results-in-three-states-announced

న్యూఢిల్లీః ఇటీవల పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు చేపట్టారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కొద్దిసేపటి కింద వెలువడ్డాయి. పంజాబ్ లోని జలంధర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకూ విజయం సాధించారు. కాంగ్రెస్ ఎంపీ సంతోష్ సింగ్ మరణంతో జలంధర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిపారు. ఒడిశాలోని జార్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేడీ (బిజూ జనతాదళ్) విజయం సాధించింది. బీజేడీ అభ్యర్థి దీపాలీ దాస్ గెలిచారు. ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని బిజూ జనతాదళ్ నిలబెట్టుకుంది.

ఇక, ఉత్తరప్రదేశ్ లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించగా… రెండు చోట్లా అప్నాదళ్ (సోనేలాల్)నే విజయం వరించింది. యూపీలో సువార్, ఛన్బే అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిపారు. సువార్ లో అహ్మద్ అన్సారీ నెగ్గారు. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజామ్ ఖాన్ తనయుడు అబ్దుల్లా అజామ్ ఖాన్ కు కోర్టు 15 ఏళ్ల నాటి కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో సువార్ లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఛన్బే నియోజకవర్గంలో రింకీ కోలే గెలిచారు. యూపీలో అప్నాదళ్… అధికార బిజెపికి భాగస్వామిగా ఉంది.