జగన్ వాటా రూ. 50 వేల కోట్లు అయితే వెంకట్ రెడ్డి వాటా ఎంత? : నక్కా ఆనంద్

nakka anand babu
nakka anand babu

అమరావతి: ఇసుక స్కామ్‌లో సిఎం జగన్ వాటా రూ. 50 వేల కోట్లు ఉంటుందని టిడిపి నేత నక్కా ఆనంద్ బాబు తెలిపారు. ఎన్‌టిఆర్ భవన్‌లో టిడిపి నేత నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. జగన్ వాటా రూ. 50 వేల కోట్లు అయితే వెంకట్ రెడ్డి వాటా ఎంత? అని ప్రశ్నించారు. ప్రధాన వాటాదారు ఎపిఎండిసి విసి, డైరెక్టర్‌గా ఉన్న వెంకట్ రెడ్డే ఉన్నాడని ఆరోపణలు చేశారు. ఉచిత ఇసుక విధానంలో అవినీతి ఎక్కువగా ఉందని వెంకట్ రెడ్డి ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. భవిష్యత్‌లో శిక్ష తప్పదనే ఉద్దేశంతోనే ముందుగా ఆయన ఒక ఫిర్యాదు చేశారని దుయ్యబట్టారు. ఆపరేషన్ వంకతో వెంకట్ రెడ్డి ఇంటినే ఒక ఆఫీస్‌గా మార్చుకున్నారని నక్కా ఎద్దేవా చేశారు. ఇసుక తవ్వకాన్ని బట్టబయలు చేసినందుకే ఎదురు కేసులు పెట్టారని, నకిలీ వేబిల్లులతో ఎపి సంపదను కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. కోల్‌కతా నుంచి రహస్యంగా నడిపిన ఇసుక టెండర్ల విధానం మరో స్కాం అని నక్కా మండిపడ్డారు. నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి వేల కోట్లు ఇసుక ద్వారా దోచుకున్నారని, ఇసుక స్కామ్ డబ్బుతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని జగన్ చూస్తున్నారన్నారు.