గ్యాస్ ధరలు తగ్గించాలంటూ రోడ్డెక్కిన బిఆర్ఎస్ శ్రేణులు

మరోసారి భారీగా గ్యాస్ ధర పెరగడం తో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మోడీ దిగితే కానీ సామాన్యుడు బ్రతకలేడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు మార్చి ఒకటి నుండి భారీగా పెరిగాయి. 14.2 కేజీ డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరపై ఏకంగా రూ. 50 రూపాయలు పెరిగింది. అలాగే, 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 350.50 రూపాయలు పెరిగింది.

దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో డొమెస్టిక్ సిలిండర్ ధర 1155 రూపాయలకు చేరింది. ఇక గ్యాస్ సిలిండర్ పెరుగుదలతో.. కేంద్ర ప్రభుత్వంపై సామాన్యులు మరోసారి ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశానికి తాకుతుంటే..ఇప్పుడు గ్యాస్ ధర ఏకంగా రూ. 50 పెంచడం ఫై కేంద్రం ఫై నిప్పులు చెరుగుతున్నారు. పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు అధికార పార్టీ నాయకులు మహాధర్నా చేపట్టారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు గ్యాస్ సిలిండర్లు, కట్టెల మోపులతో వినూత్నంగా నిరసన తెలియజేశారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

అలాగే బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. నిండా ముంచిన బీజేపీని ముంచాలని ప్రజలు చూస్తున్నారని వెల్లడించారు. అడ్డగోలుగా గ్యాస్‌ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత యూపీఏ హయాంలో గ్యాస్‌పై ప్రభుత్వం రూ.2.14 లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చేదని .. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ పూర్తిగా ఎత్తివేసిందని విమర్శించారు. గతంలో గ్యాస్‌ ధర రూ.400 ఉంటేనే బీజేపీ గగ్గోలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరి ఇప్పుడు రూ.1100 దాటిందని, ఆ పార్టీ నాయకులు ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు.