రాజాసింగ్ ఫై అధిష్టానం సీరియస్… పార్టీ నుంచి సస్పెండ్

ఓ వ‌ర్గంపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ స‌స్పెన్ష‌న్ వేటు వేసింది.
పార్టీనుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ఆ పార్టీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే రాజాసింగ్‌కి బీజేపీ అధిష్ఠానం షాకిచ్చింది. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రాజాసింగ్ సోషల్‌మీడియాలో విడుదల చేసిన వీడియో దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.

తమ దైవాన్ని అవమానించిన ఆయనపై కఠినచర్యలు తీసుకోవాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అసలే నుపుర్ శర్మ వ్యవహారంతో చిక్కుల్లో పడిన బీజేపీ అధిష్ఠానం రాజాసింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రాజాసింగ్‌ విడుదల చేసిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ హైకమాండ్‌ .. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వడానికి బీజేపీ పది రోజులు గడువిచ్చింది. సెప్టెంబర్‌ 2లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేను ఆదేశించింది.