కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందిః కిషన్ రెడ్డి

లక్ష్మణ్, ఈటల, రఘునందనరావు తదితర బిజెపి నేతలతో కలిసి పరిశీలించిన కిషన్ రెడ్డి

bjp-leaders-at-medigadda-project

హైదరాబాద్‌ః గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కుంగుబాటు గురించి మాట్లాడవద్దనే ఉద్దేశంతో తాము ప్రాజెక్టును సందర్శించామని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శనివారం రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌, మరికొందరు బిజెపి నేతలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు అనుమానాస్పదంగా మారిందన్నారు. ప్రజల పన్నులతో కట్టిన జాతీయ సంపద ఈ ప్రాజెక్టు అని, అందుకే దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

కెసిఆర్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, విధానాలపై తెలంగాణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. మేడిగడ్డ వద్ద కుంగిన ప్రాంతాన్ని పూర్తిగా తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ చూశాక మాట్లాడాలనే ఉద్దేశ్యంతో తాము ఈ ప్రాజెక్టును సందర్శిస్తున్నామన్నారు. కాగా, బిజెపి నేతలు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడిగడ్డ వద్దకు చేరుకున్నారు.