తెలంగాణలో మొదటిసారి బిజెపి ప్రభుత్వం రాబోతుందిః ప్రధాని మోడీ ధీమా
అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ
కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికతో సిఎం కెసిఆర్కు ట్రైలర్ చూపించామని, ఈ ఎన్నికల్లో పూర్తి సినిమా చూపిస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కరీంనగర్లో జరిగిన బిజెపి సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణలో బిజెపి ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఆట ముగియనుందని జోస్యం చెప్పారు. మొదటిసారి తెలంగాణలో బిజెపి ప్రభుత్వం రాబోతుందన్నారు. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావుని ప్రతి అడుగులో అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు… ఆ పార్టీలు ఏర్పాటు చేసే ప్రభుత్వాలు అవసరం లేదన్నారు. గ్యారెంటీలను నెరవేర్చే మోడీ సర్కార్ తెలంగాణకు అవసరమన్నారు. మోడీ గ్యారెంటీ అంటే అందరికీ ఉచిత వైద్యం… మోడీ గ్యారెంటీ అంటే అందరికీ ఆరోగ్యం… మోడీ గ్యారెంటీ అంటే రైతులకు చేయూత అన్నారు. బిజెపి ప్రజా సంక్షేమం కోసమే పని చేస్తుందన్నారు. ఓ వైపు ప్రజలను మోసం చేసిన కెసిఆర్… మరోవైపు మీ సేవకుడు మోడీ ఉన్నారని, తెలంగాణ ప్రజలు బిజెపికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.