రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బిజెపి
ఈ నెల 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
న్యూఢిల్లీః రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా మరో మూడు స్థానాలకు గాను బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. గుజరాత్ నుంచి ఇద్దరు, పశ్చిమ బెంగాల్ నుంచి ఒకరిని తమ అభ్యర్థులుగా బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ నుంచి అనంత మహారాజ్, గుజరాత్ నుంచి బాబూభాయ్ జేసంగ్ భాయ్ దేశాయ్, కేశ్రీదేవ్ సిన్హ్ జాలాకు అవకాశం కల్పించింది.
ఈనెల 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ లో 6 స్థానాలు, గుజరాత్ లో 3, గోవాలో 1 స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇప్పటికే గుజరాత్ నుంచి బిజెపి తరపున నామినేషన్ వేశారు. మరోవైపు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ అవకాశం దక్కక పోవడం గమనార్హం.