బీహార్లో పట్టాలు తప్పిన నార్త్ఈస్ట్ ఎక్స్ప్రెస్..7 మృతి
ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులకు భయబ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగి వందలాది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలువగా..తాజాగా బిహార్లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అసోంలోని కామాఖ్యాకు వెళ్తోన్న నార్త్ఈస్ట్ ఎక్స్ప్రెస్కు చెందిన ఆరు బోగీలు బీహార్లోని రఘునాథ్పుర్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 9.35 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద విషయం తెలియగానే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. పాట్నాలోని కీలక ఆసుపత్రులైన పట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను హైఅలర్ట్లో ఉండాలని ఆదేశించింది. సహాయక చర్యల కోసం ఘటనాస్థలానికి పది అంబులెన్స్లను పంపించింది.
కాగా, ఈ ప్రమాదంపై జిల్లా విపత్తు నిర్వహణ శాఖతో చర్చించామని బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ‘‘విపత్తు నిర్వహణ శాఖతో పాటూ ఆరోగ్య శాఖ, బక్స్ర్ జిల్లా యంత్రాంగంతో మాట్లాడి పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టాలని సూచించాం. పాట్నాలోని ఆసుపత్రులను కూడా హైఅలర్ట్లో ఉండాలని ఆదేశించాం’’ అని పేర్కొన్నారు. ఈ ఘటన సాంకేతిక లోపంతో జరిగిందా లేదా ఎవరైనా కావాలనే కుట్ర పన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.