అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని బైడెన్ పిలుపు

వ్యాక్సిన్​ వేసుకోకుంటే ప్రమాదకర వేరియంట్లు సోకుతాయ్..జో బైడెన్​

వాషింగ్టన్: ప్రతి అమెరికన్ విధిగా కరోనా టీకా వేయించుకోవాలని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జూలై 4 నాటికి 70 శాతం మంది పెద్దవారికి కరోనా వ్యాక్సిన్ వేయాలన్నది లక్ష్యం.. కానీ, ఆ లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితులు ఇప్పుడు కనిపించట్లేదు. దీంతో బైడెన్ రంగంలోకి దిగారు. ఎవరైనా వేసుకోబోమని మొండికేస్తే.. వారికి అత్యంత శక్తిమంతమైన కరోనా వేరియంట్లు సోకే ప్రమాదముందని హెచ్చరించారు.

అయితే, తాను అధికారం చేపట్టిన నుంచి ఇప్పటిదాకా 150 రోజుల్లోనే 30 కోట్ల డోసులు టీకాలు వేశామని ఆయన చెప్పారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ బాగానే సాగుతున్నా.. టీకాలు తక్కువగా వేస్తున్న రాష్ట్రాల్లో మాత్రం డెల్టా వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి వేరియంట్ల నుంచి కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, జనాల్లో కరోనా టీకాపై ఆసక్తి పెరిగేలా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆరోగ్య శాఖ మంత్రి జేవియర్ బెకెర్రాలు స్వయంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సగం మంది కన్నా తక్కువగా వ్యాక్సిన్ వేసుకున్న అట్లాంటాలోని ఫుల్టన్ కౌంటీలో కమలా హారిస్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/