తొమ్మది రోజుల పాటు తెలంగాణ లో బతుకమ్మ సంబరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు

బతుకమ్మ సంబరాలకు తెలంగాణ సర్కార్ సిద్దమవుతుంది. మరో ఆరు రోజుల్లో బతుకమ్మ సంబరాలు మొదలుకానున్న నేపథ్యంలో ఈరోజు సోమవారం బీఆర్‌కే భవన్‌లో సమన్వయ సమావేశం భేటీ అయ్యింది. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆయాశాఖ అధికారులు ఈ భేటీ లో పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలకు సంబదించిన ఏర్పాట్ల ఫై సమీక్షా జరిపారు. ఈ నెల 25 నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు బతుకమ్మ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ.. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 3న ట్యాంక్‌బండ్‌ వద్ద సద్దుల బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయన్నారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్‌ దీపాలతో అలంకరించాలన్నారు. బతుకమ్మ పండుగపై ఆకర్షణీయమైన డిజైన్లతో మెట్రో పిల్లర్లను అలంకరించాలని అధికారులను ఆదేశించారు.

ఇక ‘బతుకమ్మ’ పండుగను తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.