బీజేపీకి మరో భారీ షాక్..ఈ నెల 31 వరకు వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో సభలు, ర్యాలీలపై నిషేధం

బిజెపి పార్టీ కి మరో షాక్ ఇచ్చారు వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈరోజు నుండి ఈ నెల 31 వరకు వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో సభలు, ర్యాలీలపై నిషేధం విధించారు నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. నగరంలో శాంతి భద్రతలు, ప్రశాంతతను కాపాడాలనే ఉద్దేశంతో నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు ఇవి అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఉత్తర్వులు ఉల్లంఘించినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభ రేపు హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలో పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆంక్షలు విధించడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ సభను అడ్డుకునే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.

మరోపక్క బండి సంజయ్ పాదయాత్ర ఆపాలని ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. పాదయాత్ర ఆపాలని పోలీసులిచ్చిన నోటీసును సస్పెండ్ చేస్తూ.. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని సీజే ధర్మాసనాన్ని ప్రభుత్వం కోరింది. పాదయాత్ర కొనసాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. తరుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.