ఎంపీ మహువా మొయిత్రాకు లోక్సభ ఎథిక్స్ కమిటీ ఆదేశం
న్యూఢిల్లీః పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తేందుకు డబ్బులు తీసుకున్నారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో లోక్సభ ఎథిక్స్ కమిటీ అక్టోబర్ 31న తమ ఎదుట హాజరుకావాలని మహువాను కోరింది. ఆరోపణలపై గురువారం ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఎంపీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు హోం, ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి సహాయం తీసుకుంటుందని బిజెపి ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ తెలిపారు. సమావేశం తర్వాత 31న ప్యానెల్ ముందు హాజరుకావాలని ఎంపీని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంలో ప్యానెల్లో వాకీస్ జై అనంత్ దేహద్రాయ్, బిజెపి నేత నిషికాంత్ దూబే వాంగ్మూలాలను నమోదు చేశారు.
అయితే, ప్రధాని నరేంద్ర మోడీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై విమర్శలు చేయడంతో పాటు అందుకు అనుగుణంగా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి మహువా డబ్బులు తీసుకున్నట్లు నిషికాంత్ దూబే ఆరోపిస్తూ లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. ఈ క్రమంలో ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతున్నది. అయితే, మహువా మోయిత్రా ఈ ఆరోపణలు నిరాధారమైనవిగా కొట్టిపడేశారు. తన పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంటూ బిజెపి ఎంపీతో పాటు దేహద్రాయ్పై పరువు నష్టం కేసును దాఖలు చేశారు.