రేపు నేను ‘బస్తీ నిద్ర’ చేస్తాను..బండి

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బిజెపి ‘బస్తీ నిద్ర’ కార్యక్రమం..బండి సంజయ్

bandi sanjay

హైదరాబాద్‌: బిజెపికి దుబ్బాక ఉప ఎన్నిక విజయం ఇచ్చిన ఉత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఫుల్ జోష్‌తో పనిచేస్తున్నారు. బిజెపి నేతలు బస్తీ నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తమ పార్టీ నేతలకు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పలు సూచనలు చేశారు. ‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బిజెపి ‘బస్తీ నిద్ర’ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పిలుపునిస్తున్నాను. ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో నాతోపాటు, పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ‘బస్తీ నిద్ర’ చేస్తాము’ అని చెప్పారు.

‘ఈ కార్యక్రమంలో భాగంగా రేపు నేను ‘బస్తీ నిద్ర’ చేస్తానని ప్రకటిస్తున్నాను. ‘బస్తీ నిద్ర’ కార్యక్రమంలో సామాన్యులు నివసించే ప్రాంతాల్లోనే నిద్ర చేయాలని, బస్తీల్లో ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుని వారితో మమేకం కావాలని కోరుతున్నాను’ అని బండి సంజయ్ తెలిపారు. ‘బిజెపి కార్పొరేటర్లు గెలిచిన తరువాత కూడా ‘బిజెపి బస్తీ నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాను’ అని బండి సంజయ్ చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/