ఉప్పల్ లో దారుణం : తండ్రి , కొడుకులను చంపిన దుండగులు

హైదరాబాద్ ఉప్పల్ లోని హనుమాన్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. తండ్రి , కొడుకులను అతి దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఉప్పల్‌ హనుమాన్‌ సాయినగర్‌కు చెందిన నర్సింహశర్మ, శ్రీనివాస్‌ తండ్రీ కొడుకులు. శ్రీనివాస్‌ మలేషియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. నెల రోజుల కిందటే మలేషియా నుంచి వచ్చాడు. కాగా శుక్రవారం ఉదయం గుర్తుతెలియండి కొంతమంది దుండగులు ఇంట్లోకి ప్రవేశించి తండ్రి నర్సింహశర్మ, కొడుకు శ్రీనివాస్‌లను కత్తులతో కడుపులో పొడిచి అతి కిరాతకంగా హతమార్చారు.

తండ్రిపై దాడి చేస్తున్న సమయంలో కొడుకు అడ్డుకోబోయాడు. శ్రీనివాస్‌పైనా కూడా దుండగులు కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ హత్యను తమ బంధువులే చేశారంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భూవివాదంలో గతంలో కూడా ఈ విధమైన దాడి జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన స్థలాన్ని డీసీపీ, ఏసీపీ పరిశీలించారు. నిందితుల కోసం వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది.