ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు..షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. లోక్సభతోపాటే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కూడా ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు భారత ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించారు.
లోక్సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న నిర్వహించనున్నారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 26న, మూడో దశ ఎన్నిలక పోలింగ్ మే 7న, నాలుగో దశ ఎన్నికల పోలింగ్ మే 13న, ఐదో దశ ఎన్నికల పోలింగ్ మే 20న, ఆరో దశ ఎన్నికల పోలింగ్ మే 25న, ఏడో దశ ఎన్నికల పోలింగ్ జూన్ 1న జరుగనున్నాయి. జూన్ 4న లోక్సభ ఎన్నికలతోపాటే వివిధ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.