కెటిఆర్ లీగల్ నోటీసుపై స్పందించిన బండి సంజయ్
హైదరాబాద్: తనపై నిరాధార ఆరోపణలు చేశారని మంత్రి కెటిఆర్ పంపిన లీగల్ నోటీసుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. నోటీసులను తాను లీగల్గానే ఎదుర్కొంటానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కెటిఆర్ 100 కోట్లకు నాపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. కెటిఆర్ పరువు ఖరీదు 100 కోట్లా? మరి యువత భవిష్యత్తు మూల్యమెంత? పేపర్ లీకేజీలో నా కుట్ర ఉందని కెటిఆర్ ఆరోపించారు. అలాగైతే ఆయనపై నేనెన్ని కోట్లకు దావా వేయాలి. పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. నష్టపోయిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ₹లక్ష ఇవ్వాల్సిందే. మంత్రి కెటిఆర్ను బర్తరఫ్ చేసేదాకా పోరాడతాం’’ అని సంజయ్ ప్రకటనలో పేర్కొన్నారు.