బండి సంజయ్ ‘నిరుద్యోగ దీక్ష’ ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన నిరుద్యోగ దీక్ష ప్రారంభమైంది. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగు, విజయశాంతి, ఈటెల రాజేందర్ ఇతర బిజెపి నాయకులు పాల్గొన్నారు. కాగా, తొలుత ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగ దీక్ష చేయాలని భావించారు. అయితే, ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోనే నిరుద్యోగ దీక్ష చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి నిరుద్యోగులను పట్టించుకోవ‌డం లేద‌ని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగ నోటిఫికేష‌న్లు విడ‌ద‌ల చేయ‌డం లేద‌ని మండిపడ్డారు. ఉద్యోగాలు లేక 600 మంది నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని చెప్పారు. నిరుద్యోగ దీక్షకు వ‌స్తున్న విద్యార్థుల‌ను, నిరుద్యోగుల‌ను అడ్డుకుని అరెస్టు చేయ‌డం ఎంటి అని ప్ర‌శ్నించారు. తాను దీక్ష చేస్తే.. కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నాడ‌ని బండి విమర్శించారు. ప్రజాస్వామ్యబద్దంగా చేపడుతున్న దీక్షకు రాకుండా అడ్డుకోవడం కేసీఆర్ నియంత, అహంకార పాలనకు నిదర్శనం అని బండి మండిపడ్డారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/