హనుమాన్ మాదిరిగానే పార్టీ కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలిః ప్రధాని మోడీ
పార్టీ స్థాపన దివస్ సందర్భంగా బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
న్యూఢిల్లీః నేడు పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి కార్యకర్తలు, నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందేశం ఇచ్చారు. ఈరోజు ఉదయం ఆయన ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో క్యాడర్ ను ఉద్దేశించి ప్రసంగించారు. హనుమాన్ జయంతి ఇదే రోజు కావటంతో.. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు మోడీ. హనుమాన్ చేయలేనిది అంటూ ఏదీ లేదని.. అలాగే బిజెపి కార్యకర్తలు కూడా తలచుకుంటే ఏదైనా సాధించగలరన్నారు మోడీ. హనుమాన్ మాదిరిగానే పార్టీ కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని సూచించారు. పేదలకు సామాజిక సేవ, న్యాయం చేయటమే బిజెపి విధానం అని.. ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలకు నిరంతరం సేవ చేస్తుందని కీర్తించారు మోడీ.
దేశంలోని కాంగ్రెస్, ఇతర పార్టీలు తమ విధానం ఏంటో తెలియకుండానే.. బీజేపీపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయని.. అందుకే వారి అడ్రస్ గల్లంతు అయ్యిందన్నారు ప్రధాని. దేశం కోసం బీజేపీ పెద్ద పెద్ద కలలు కంటుందని.. వాటిని సాకారం చేసి దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో నిలబట్టటం కోసం అకుంఠిత దీక్షతో పని చేస్తున్నామన్నారు. దేశంలో అవినీతిపై యుద్ధాన్ని హనుమంతుడి తరహా పోరాటం చేస్తున్నామన్నారు పీఎం మోడీ. ఈ సందర్భంగా మిషన్ 2024 ప్రారంభించారు. రాబోయే ఎన్నికల ద్వారా దేశ ప్రజల కలలను సాకారం చేసే విధంగా కృషి చేయాల్సి ఉందన్నారు మోడీ.