కెసిఆర్ చెప్పే మాటలు అన్నీ కోతలే: బండి సంజయ్

హైదరాబాద్‌ః విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం బిడ్డింగ్ వేస్తానని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు పారిపోయారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం అన్నారు. కెసిఆర్ చెప్పే మాటలు అన్నీ కోతలే అని ఎద్దేవా చేశారు. ఇక్కడ తెలంగాణలో ఏం చేయని కెసిఆర్ ఆంధ్ర ప్రదేశ్ లో ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇప్పుడేమో తమ వద్ద పైసలు లేవని చెబుతున్నారన్నారు. కెసిఆర్ వద్ద పైసలు బాగా ఉన్నాయి… అని పాపం ఆంధ్ర వాళ్లు అనుకునేలా మాట్లాడాడని, మా ఆంధ్రాలో కూడా ఏదో చేస్తాడని అనుకుంటున్నారని, ఇప్పుడు కెసిఆర్ తీరును చూసి అలా అనుకున్న వాళ్లు వాళ్ల చెప్పుతో వాళ్లే కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

బిడ్ వేస్తానని వెనక్కి పోయిన కెసిఆర్ ను చూసి దేశం మొత్తం నవ్వుకుంటోందన్నారు. కెసిఆర్ ను చూసి నవ్వుతున్నారు అని అంటే మనం కూడా నవ్వులపాలు అవుతున్నట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఎంతోమంది ప్రాణత్యాగం చేశారన్నారు. ఏం మాట్లాడుతాడో కెసిఆర్ కే తెలియదని, చెప్పింది ఒక్కటీ చేయడన్నారు.