ఇప్పుడు బిఆర్‌‌ఎస్‌ గురించి దేశానికి తెలిసిపోయిందిః బండి సంజయ్‌

కెటిఆర్‌‌ వ్యాఖ్యలకు కౌంటర్‌‌గా ట్వీట్‌ చేసిన బిజెపి ఎంపీ

bandi sanjay comments on brs party

హైదరాబాద్‌ః తాను లోక్‌సభలో చేసిన ప్రసంగం గురించి మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎంపీ బండి సంజయ్ స్పందించారు. తన ప్రసంగానికి కెటిఆర్‌‌ భయపడ్డాడని అన్నారు. బిఆర్ఎస్‌ పాలన తీరును, వైఫల్యాలను ఎండగట్టడంతో వణకిపోతున్నారా? అని ప్రశ్నించారు. బిఆర్‌‌ఎస్‌ గురించి ఇప్పుడు దేశానికి తెలిసిపోయిందని ట్వీట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాబోయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కారును తక్కు చేస్తుందని అన్నారు.

‘ప్రజలను దోచుకోవడం ద్వారా మీ కుటుంబ ఆదాయం ఎలా పెరిగిందో ఇప్పుడు యావత్ దేశానికి తెలిసింది. తెలంగాణల శత్రువులుగా వ్యవహరిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్‌, ఎంఐఎంతో దోస్తీని బిజెపికి వ్యతిరేకంగా ఎలా ప్రదర్శిస్తున్నారు?. ఆర్టీసీ కార్మికులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, రైతులు, యువకులతో, జీఓ 317తో ఉపాధ్యాయుల జీవితాలతో బిఆర్‌‌ఎస్ ప్రభుత్వం ఎలా ఆడుకుంది? మిషన్ భగీరథ నిధుల ఎలా దుర్వినియోగం అవుతున్నాయి? పబ్లిక్ టాయిలెట్ల కోసం కేంద్రం కేటాయించిన డబ్బును మీరు ఎలా దొంగిలించారు? పేదలకు మోదీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం కోసం మీరు జనాల నుంచి ఎలా డబ్బులు వసూలు చేశారు? ఉపాధి హామీ కార్మికులకు కేటాయించిన డబ్బును మీరు ఎలా దారి మళ్లించారు? సంక్షేమ పథకాల అమలులో కేంద్ర ప్రభుత్వానికి ఎలా సహకరించడం లేదో? 24 గంటల విద్యుత్ సరఫరా గురించి మీరు ఎలా అబద్ధం చెప్పారు? అనే విషయాలను బయట పెట్టడంతో వణికిపోతున్నారు’ అని సంజయ్ ట్వీట్‌ చేశారు.